రాష్ట్రంలో స్కూళ్లు తెరుచుకునే అవకాశాలే లేవా? ఇదే నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులు భావిస్తున్నందున ప్రస్తుత విద్యా సంవత్సరం ఇక ముగిసినట్లే అనుకోవాలి. కోవిడ్ ఉధృతి కారణంగా గత ఏడెనిమిది నెలలుగా బడులు మూతబడి ఉన్నాయి.
సిలబస్ విషయంలో లేని స్పష్టత
ఒకవేళ తెరచి నిర్ణీత వ్యవధి బడి గంటలను తగ్గించి ప్రయోగం చేద్దామనుకున్నా ఆ ప్రయత్నం ఫలించేటట్టు లేదు. వేసవి కాలంలో మార్నింగ్ పాఠశాలలు.. ఒంటిపూట బడుల మాదిరిగా ఉదయం వేళల్లోనే తరగతులు నిర్వహించి సిలబస్ కంప్లీట్ చేయలన్న ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా విద్యా సంవత్సరంలో కచ్చితంగా సిలబస్ పూర్తిచేయాలనే నిబంధనలు ఉండటంతో పాఠశాలల యాజమాన్యాలు కిందామీదా పడుతున్నాయి. చాలా స్కూళ్లు ఇప్పటికే సిలబస్ త్వరితగతిన పూర్తి చేయడానికి వివిధ రకాల కసరత్తులు మొదలుపెట్టాయి.
ఎలిమెంటరీ పిల్లల కట్టడి కష్టసాధ్యమే
ఈ వారం కొన్ని ప్రాంతాలలో స్కూళ్లు ఓపెన్ అయినా విద్యార్ధుల హాజరు శాతం మాత్రం చాలా తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. హైస్కూల్ విద్యార్థులను ఏదో ఒకరకంగా సర్ధిచెప్పి సిలబస్ పూర్తి చేయొచ్చునేమో కానీ, ఎలిమెంటరీ స్కూళ్ల పిల్లలను కట్టడి చేయడం కష్టసాధ్యమే. పై తరగతులకు ప్రమోట్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించే అవకాశం ఉంది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించినా విద్యార్ధుల విషయంలో మాత్రం ఎటువంటి సానుకూల వైఖరి కనబరచలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.