దోచుకోవడం, దాచుకోవడమే కల్వకుంట్ల కుటుంబ ప్రత్యేకత అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ముదిగొండ మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లోకి చేరుతున్న సందర్భంగా వెంకటాపురం గ్రామంలోని ఆర్. కె. ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
తొలుత సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నియోజకవర్గ నాయకులు డాక్టర్ కోటా రాంబాబుతో కలిసి ర్యాలీగా వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం వారితో కలిసి కాంగ్రెస్ లోకి చేరుతున్న వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దోచుకుని దాచుకున్న సొత్తంతా బీఆర్ఎస్ నాయకుల నుంచి కక్కిస్తామన్నారు.
కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ రాకముందు ఉన్న ఆస్థి ఎంత ? ఇప్పుడెంతా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు రంగులేయడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. తెలంగాణకు ఈనెల 17న సోనియమ్మ వచ్చి ఐదు ఖచ్చితమైన డిక్లరేషన్ అమలు హామీలను ప్రకటిస్తారని తెలిపారు. లక్షలాదిగా మనమంతా తరలివెళ్లి సోనియమ్మ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేసేది చెప్పడం…
చెప్పింది ఖచ్చితంగా చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత అని పేర్కొన్నారు. తెలంగాణను ధనిక రాష్ట్రాన్ని చేస్తామని చెప్పి ఐదులక్షల రూపాయాల అప్పుల్లోకి తీసుకెళ్లిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని మరోమారు గుర్తు చేశారు. రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో మన కలలను నెరవేర్చుకుందామని పేర్కొన్నారు.