ఎన్నికల విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలో ఎన్నికల విధులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండడం, కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు మాస్కులు ధరించి ప్రచారం చేసేలా అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించే వారిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణలో సిబ్బంది పాత్ర చాలా కీలకమని అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చెక్ పోస్టుల వద్ద పనిచేస్తున్న సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు మద్యం, డబ్బు అక్రమ రవాణా అరికట్టే విధంగా కఠినంగా వ్యవహరించాలని ఎలాంటి సందేహాలున్నా సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించి వారి సూచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పారు.
ఎన్నికల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధ్యతాయుతంగా మెలగాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు వహిస్తూ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, సజావుగా జరిగే విధంగా చూడాలని సూచించారు.
ఎన్నికల విధులలో పాల్గొంటున్న సిబ్బందికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఏదైనా ఇబ్బంది తలెత్తితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని ఎస్పీ రంగనాధ్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూములని ఆయన పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఎస్.బి. డిఎస్పీ రామణారెడ్డి, సిఐలు రాఘవులు, గౌరునాయుడు, సత్యనారాయణ, ఎస్.ఐ.లు కొమిరెడ్డి కొండల్ రెడ్డి, శివ కుమార్, నర్సింహా రావు, సైదాబాబు, మోహన్, సుధాకర్, ట్రైనీ ఎస్.ఐ.లు, పోలీస్ సిబ్బంది ఆఫ్రోజ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.