విధి నిర్వహణలో ఉన్న ఒక విద్యుత్ ఉద్యోగి తీవ్ర గాయాలకు లోనైన సంఘటన నిర్మల్ జిల్లా బాసర మండలంలో జరిగింది. విద్యుత్ సంస్థలో డిస్ట్రిబ్యూషన్ లైన్ మెన్ గా బాసర నివాసి శ్రీను కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. రాత్రి ఓ ఇంటిలో కరెంట్ రావడం లేదని ఫోన్ చేయడంతో వెళ్లి చూడగా సర్వీస్ వైర్ కాలిపోయింది. ఆపరేటర్ లక్ష్మణ్ సాయంతో ఎల్ సి తీసుకోని సరిచేసి విద్యుత్ సరఫరా ఇచ్చారు.
అయితే ఆ ఇంటికి విద్యుత్ రాలేదు. దాంతో మళ్లీ అక్కడకు వెళ్లి గమనించే సమయం లో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా జరిగింది. దాంతో శ్రీను కు ప్రమాదం జరిగింది. ఇది గమనించిన ఆపరేటర్ లక్ష్మణ్ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే శ్రీను కు విద్యుత్ షాక్ తో కుడి చేయి కాలింది.
శ్రీను పట్ల బాసర ప్రజలకు మంచి అభిప్రాయం ఉండటంతో తెల్లవారు జామున కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స జరుగుతున్నది కానీ ప్రభుత్వం వెంటనే ఆదుకొని న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.