తెలుగు పత్రికా ప్రపంచంలో మకుటంలేని మహరాజులా వెలుగుతున్న ఈనాడు భారీ కుదుపునకు లోనైంది. పత్రిక విస్తరణే తప్ప వెనుకంజ లేని ఈనాడు చరిత్రకు బ్రేక్ పడింది. కరోనా కారణంగా పత్రికా ప్రకటనల ఆదాయం భారీగా పడిపోవడంతో ఈనాడు యాజమాన్యం ఎడిషన్లను మూసివేసే ప్రక్రియకు విజయనగరం ఎడిషన్ తో శ్రీకారం చుట్టింది.
ఈ మేరకు విజయనగరం ఎడిషన్ లే ఆఫ్ నోటీసును నిన్న జారీ చేసింది. నిన్న అర్ధ రాత్రి జారీ చేసిన ఈ నోటీసుతో ఈనాడు చరిత్రలో మూసివేతల అంకం ప్రారంభమైనట్లుగా చెప్పవచ్చు. ఇప్పటికే కరోనా వైరస్ ఒక ఉద్యోగికి సోకిందని తెలియడంతో కడప ఎడిషన్ ను మూసేసిన ఈనాడు యాజమాన్యం ఇప్పుడు, విజయనగరం ఎడిషన్ ను మూసేసింది.
దీంతో ఈనాడు ఉద్యోగులపై పిడుగు పడినట్లయింది. కరోనా నేపథ్యంలో అడ్వర్టైజ్మెంట్లు ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గడంతో ఉద్యోగులకు కొద్దిరోజుల పని, వేతనం ఇవ్వగలుగుతామని, నిన్న అర్ధరాత్రి ఈనాడు యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల వేతనంతో మేము ఎలా బతకాలి అని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.