మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పును అత్యధిక ప్రజానీకం ఆహ్వానిస్తున్నదని ఆంధ్ర ప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు అన్నారు. మూడు రాజధానుల చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలేదని, సి.ఆర్.డి.ఎ తో అమరావతి రైతుల ఒప్పందం అనుసరించి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు.
ఇప్పటికైనా జగన్మోహన రెడ్డి పిచ్చి పిచ్చి ఆలోచనలను విరమించి, నిర్మాణం అవుతూ పూర్తికావాల్సిన భవనముల పనులను పూర్తిచేసి ఉద్యోగులకు, న్యాయమూర్తులు,ప్రజాప్రతినిధులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రహదారులు, డ్రెయినేజీ ,నీటిసరఫరా పనులను చేపట్టాలని ఆయన కోరారు.
విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పెట్టబోతున్నామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఇక నుంచి అయినా పిచ్చి ప్రేలాపన మానుతారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. హైకోర్టులో రైతులపక్షాన సమర్థవంతంగా వాదనలు వినిపించిన న్యాయవాదులందరికి అభినందనలు తెలిపారు. రెండు సంవత్సరాలు పైగా ఉద్యమాన్ని ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సజీవంగా నిలబెట్టిన రైతులకు ప్రత్యేకంగా మహిళా సోదరీమణులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేశారు.