కరోనా మహమ్మారి ప్రబలుతున్న దృష్ట్యా ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అదే సందర్భంలో అజాగ్రత్త కూడా పనికిరాదన్నారు.
ఆర్టీసి బస్సులు, బస్ స్టాండ్ ల్లో, ఆర్టీఏ కార్యాలయాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యల చేపట్టాలని అధికారులను మంత్రి అజయ్ కుమార్ ఆదేశించారు. పండుగ నేపథ్యంలో ప్రయాణం చేసే ప్రయాణికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని తెలిపారు. కార్యాలయాల్లో తమ విధులు నిర్వర్తించే రవాణా శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. రిజిస్ట్రేషన్ల ఇతర పనులు నిమిత్తం కార్యాలయానికి ప్రజలు రాకుండా అదే విధంగా వారికి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని మంత్రి పువ్వాడ సూచించారు.
ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఆన్లైన్ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీఏ కార్యాలయాల్లో 59 రకాల సేవలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రవాణా శాఖలో 17 రకాల సేవలను కార్యాలయానికి వెళ్లకుండానే పొందే వీలును ప్రభుత్వం కల్పించిందని ఇష్యూ ఆఫ్ టెంపరరీ పర్మిట్, పునరుద్ధరణకు అనుమతి, కొత్తవి మంజూరు, క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ, చిరునామా మార్పు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర సేవలు ఈ జాబితాలో ఉన్నందున కరోనా దృష్ట్యా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.