ప్రముఖ దేశీ దిగ్గజ బ్యాంక్ స్టే్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరి అరెస్టు అయ్యారు. ఇక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
రూ.25 కోట్ల రుణ చెల్లింపు వ్యవహారంలో దాదాపు 200 కోట్ల హోటల్ ఆస్తి జప్తు, ఆ ఆస్తిని అతి తక్కువ ధర దాదాపు రూ.25 కోట్లకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీకి విక్రయించడం లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఢిల్లీలో ఆయనను అరెస్ట్ చేసి, జైసల్మేర్కు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
2007లో జైసల్మేర్లో గర్ రాజ్వాడ హోటల్ ప్రాజెక్టుకు గోడవన్ గ్రూప్కు ఎస్బీఐ దాదాపు రూ.25 కోట్ల రుణం అందించింది. మూడు సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టు ఎటువంటి పురోగతి లేదు. 2010లో ఈ అకౌంట్ మొండిబకాయిగా (ఎన్పీఏ) మారింది. రుణ పరిష్కార కేసులో దాదాపు రూ.200 కోట్ల విలువైన హోటల్ ప్రాపర్టీని సీజ్ చేసి, మోసపూరిత మార్గాల ద్వారా కేవలం రూ.25 కోట్లకే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)కి విక్రయించినట్లు చౌదరిపై 2015లో కేసు నమోదైంది.