కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తోందని, భావ ప్రకటనా స్వేచ్చను కాలరాసిందని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. దేశానికి వ్యతిరేకంగా చైనా నుంచి నిధులు పొందుతోందన్న ఆరోపణ మోపి ఆన్ లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్పై కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు. మీడియా సంస్థలు, జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ ఖమ్మం జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ పక్షాలు, జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నిరసనలో భాగంగా నున్నా మాట్లాడారు.
న్యూస్ క్లిక్ మీడియా సంస్థపై దాడి చేయడమే కాకుండా అందులో పనిచేస్తున్న పలువురు పాత్రికేయులు, ఉద్యోగుల నివాసాలపై ఢిల్లీ పోలీసులు దాడులు జరిపారన్నారు. సీపీఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాంఏచూరి నివాసంపైనా దాడి చేయడాన్ని ఖండించారు. పాత్రికేయులను నిర్బంధించి వారి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిజాన్ని నిర్భయంగా చెప్పే మీడియా గొంతును ఉద్దేశపూర్వకంగా నొక్కుతోందన్నారు. న్యూస్ క్లిక్ పోర్టల్లో ప్రస్తుతం పని చేస్తున్న, గతంలో పనిచేసిన పాత్రికేయులు విలేకరులు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిపారని అన్నారు.
న్యూస్ క్లిక్ కంట్రిబ్యూటర్ అనురాధ రామన్ సత్యా తివారీ అదితి నిగమ్ సుమేదా పాల్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. న్యూస్ క్లిక్ సంపాదకుడు ప్రబీర్ పుర్కాయస్థతో పాటు పలువురు ఆ సంస్థ ఉద్యోగుల ఇళ్లపై దాడులు నిర్వహించినట్లు సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు ఆవుల అశోక్ తెలిపారు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండిరచాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ పిలుపునిచ్చారు. మోడీ 9 ఏళ్ల పాలనలో జర్నలిస్టులపై దాడులు అధికమయ్యాయని ప్రత్యామ్నాయ పౌర సమూహం సభ్యులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్ డాక్టర్ గోపీనాథ్ తెలిపారు.
భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తే సహించేది లేదని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు సంఘాల నేతలు కె.రాంనారాయణ, ఏనుగు వెంకటేశ్వర్లు, చిర్రా రవి కె. శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య శక్తుల మద్దతు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని డీసీసీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ హామీ ఇచ్చారు.