ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి అవసరమైన చికిత్సలు అందించడంతో పాటు రీడింగ్, ప్రిస్క్రిప్షన్ కళ్లజోళ్లను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
గురువారం ఖమ్మం నగరం 58 వ డివిజన్ రాపర్తినగర్లో కంటి వెలుగు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, నగరమేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎక్కువ శాతం జనాభా దృష్టిలోపాన్ని ఆశ్రద్ధ చేస్తారని, సర్వేంద్రియానం ‘‘నయనం ప్రధానం’’ అన్న నానుడిని మన ముఖ్యమంత్రివర్యులు సాకారం చేసే దిశగా జనవరి 18వ తేదీన మన ఖమ్మం జిల్లాలోనే రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా 55 బృందాలతో 100 రోజుల పాటు ఎక్కడికక్కడ కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసుప్రతులకు వెల్లనవసరం లేకుండా మీరు ఉండే ప్రదేశాలలోనే కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడే పరీక్షలు నిర్వహించి అవసరమైన కళ్లజోళ్ళను అందించడం ద్వారా దృష్టిలోపాలన్ని నివారించవచ్చని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అంధత్వ నివారణకు గాను ఖమ్మం నగరంలో ప్రతి డివిజన్లో కంటివెలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దృష్టిలోపాన్ని గుర్తించి అవసరమైన కళ్లజోళ్ళను అందించడం జరుగుతుందన్నారు. ఇట్టి అవకాశాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగ పర్చుకోవాలని కలెక్టర్ తెలిపారు.