రాష్ట్రంలో ఇప్పటి వరకూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్స్ (శాఖాధిపతులకు) కు ఫేస్ రికగ్నిషన్ తో అటెండెన్సును తప్పని సరి చేస్తూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ సాధారణ ఉద్యోగులకు మాత్రమే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్సు ఉండేది.
శాఖాధిపతులకు ఈ పద్ధతి ఉండేది కాదు. వారు మొత్తం ఉద్యోగులకు ఇన్ చార్జిలుగా వ్యవహరిస్తారు కాబట్టి వారి బాధ్యతను వేరెవరూ గుర్తు చేయాల్సిన అవసరం ఉండదని ఇంత కాలం ప్రభుత్వాధినేతలు భావించారు. అయితే జగన్ ప్రభుత్వం నేడు జీవో ఎంఎస్ నెం 122 జారీ చేసి వారికి కూడా ఫేస్ రికగ్నిషన్ అటెండెన్సును తప్పని సరి చేసింది. శాఖాధిపతులు హెడ్ క్వార్టర్స్ ను దాటి బయటకు వెళ్లినా, సెలవు పెట్టినా లేదా శిక్షణా కార్యక్రమాలకు వెళ్లినా సంబంధిత కార్యదర్శి ఆ శాఖకు ఇన్ చార్జి బాధ్యతలు స్వీకరిస్తారు.
ఈ నెల 25 నుంచి 31 వరకూ ట్రైల్ రన్ ఉంటుంది. దీనికి సంబంధించిన యాప్ ను కూడా ప్రత్యేకంగా అభివృద్ధి పరిచారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఉదయం 10 గంటలకల్లా తమ తమ కార్యాలయాల్లో ఉండాలి. వారికి పది నిమిషాల పాటు గ్రేస్ పిరియడ్ ను నిర్దేశించారు. అంటే ఉదయం 10.10 వరకూ వారు ఆఫీసులకు రావచ్చు. అయితే హెచ్ ఓ డీలు మాత్రం కచ్చితంగా ఉదయం 10 గంటల కల్లా కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది. వారికి ఎలాంటి గ్రేస్ పిరియడ్ ఉండదు.