తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులే వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి గ్రామ, మండల, పట్టణ స్థాయిలో ఫ్యాక్షన్ రాజకీయాలకే పరిమితమైందని అన్నారు.
ప్రణాళిక లేని పాలన చేయడంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందన్న భావన ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోందని చెప్పారు. వైసీపీ తొమ్మిది నెలల పాలనలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం, రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాభివృద్ధిని రివర్స్ గేర్ లో తీసుకెళ్లడం తప్ప ఏమీ చేయలేదన్నారు.
బుధవారం విశాఖపట్నంలోని జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి, అద్భుతమైన మెజార్టీ ఇస్తే ప్రజలకు మేలు చేయాలన్న తపన లేకుండా బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఉగాది నాటికి ఇంటి పట్టాల పంపిణీ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, చివరకు ఆర్మీ జవాన్లకు ఇచ్చిన భూములును సైతం లాక్కొంటోంది. భూదందాల కోసమే విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేశారు తప్ప.. దీనిపై ప్రత్యేక ప్రేమగానీ, అభివృద్ధి ప్రణాళికగానీ లేదు. ప్రశాంతంగా నివసించే ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి తమ భూదందాలకు అడ్డాగా విశాఖపట్నాన్ని మార్చుకోవడం కోసమే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. విశాఖపట్నం మంచి ఐ.టి., టూరిజం హబ్ గా మారాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటుంటే… నాయకులు చేసే ప్రకటనలు మాత్రం అయోమయం సృష్టించే విధంగా ఉన్నాయి. వెనకబడిన ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి…. కానీ ఇక్కడ దానికి రివర్స్ లో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.