ఆయనొక సాధారణ రైతు….. అయితేనేం సిసి కెమెరాల ప్రాధాన్యత తెలుసుకొని తన గ్రామం కోసం 40 వేల రూపాయలు ఖర్చు చేశాడు….. సిసి కెమెరాల ఏర్పాటు కోసం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీసుల సమక్షంలో సిసి కెమెరాల ఏర్పాటు కోసం ఆ మొత్తాన్ని అందజేసి ఆదర్శంగా నిలిచాడు.
ఇక వివరాలలోకి వెళితే నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన రైతు ఎదుళ్ల మల్లారెడ్డి అనే రైతు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళవారం కుటుంబంతో సహా పోలీస్ స్టేషన్ కు వచ్చి 40వేల రూపాయలు సిసి కెమెరాల ఏర్పాటు కోసం ఎస్.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అందించాడు.
కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తన పాలిచ్చే బర్రె గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయింది. ఆ ప్రాంతంలో సిసి కెమెరాలు లేకపోవడం బర్రెను ఢీ కొన్న వాహనాన్ని ఎవరూ గుర్తించలేక పోయారు. సిసి కెమెరాలు ఉండి ఉంటే ఆ వాహనాన్ని గుర్తించే అవకాశం ఉండదని బాధపడ్డాడు ఆ రైతు.
తనకు జరిగిన బాధ మరొకరికి కలగవద్దని భావించాడు. అంతే కాకుండా రోడ్డు ప్రమాదాలతో పాటు దొంగతనాలు జరిగినా సిసి కెమెరాల ద్వారా గుర్తించవచ్చనే ఉద్దేశ్యంతో తన గ్రామానికి తన వంతు బాధ్యతగా నేరాల అదుపు కోసం కుటుంబంతో సహా మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.
రైతు మల్లారెడ్డి తల్లి లక్ష్మమ్మ, భార్య మాలతి, కుమార్తెలు అక్షర, ఆద్యల చేతుల మీదుగా 40 వేల రూపాయలు అందజేసి సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డిని కోరారు.
వెంటనే స్పందించిన ఎస్.ఐ. సిసి కెమెరాలు ఏర్పాటు చేసే వారిని పిలిపించి ఆ మొత్తాన్ని వారికి అందజేసి వెంటనే చర్లపల్లి ప్రాంతంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేయాలని సూచించారు. సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన మల్లారెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
సామాజిక బాధ్యతతో సిసి కెమెరాల ఆవశ్యకత తెలుసుకొని కుటుంబంతో కలిసి ముందుకు వచ్చిన రైతు మల్లారెడ్డిని, అతని కుటుంబ సభ్యులను నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ మహబూబ్ బాషా, ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి, రూరల్ పోలీస్ సిబ్బంది అభినందించారు.
ఈ కార్యక్రమంలో చర్లపల్లి గ్రామస్తులు దొడ్డి రమేష్, సైదిరెడ్డి, వెంకన్న, రూరల్ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, రమేష్, హట్టి, నాగరాజు తదితరులున్నారు.