సమస్యల సుడిగుండంలో ఉన్న రైతాంగం తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. రైతులతో ముఖముఖి యాత్రలో భాగంగా నారాయణ్ ఖేడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్ తో పాటు సురేష్ షెట్కార్, సీనియర్ నాయకులు డాక్టర్ సంజీవ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రైతులను కార్పొరేట్ శక్తులకు బలి ఇచ్చేలా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే రైతులతో ముఖాముఖి.. పొలంబాట-పోరుబాట చేపట్టామని భట్టి వివరించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం, దగా చేస్తున్న రైతులకు అండగా సిఎల్పీ పక్షాన పోరాటం చేస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. రైతులతో ముఖాముఖి చేస్తుంటే ముఖ్యమంత్రి గుండెల్లో వణుకు పడుతోందని అన్నారు.
అదే విషయంలో రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కో ఉందని భట్టి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు పీసీసీ పదవుల కోసం తిరుగుతున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిఎల్పీ నాయకుడిగా నేను తిరిగేది పదవుల కోసం కాదు.. ప్రజల కోసమని .. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలుసుకోవలని చెప్పారు. పదవుల కోసం అయితే మేము కూడా మీలా ప్రజలను మోసం చెప్పేవాళ్లము.. అన్నారు.
నేను తిరిగేది మీరు చేసిన తప్పిదాలను, మీ విధానాల వల్ల రాష్ట్ర రైతాంగం, వ్యవసాయ రంగానికి అండగా ఉండేందుకు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో రైతులు కన్నీరు పెడుతున్నారని అన్నారు.