కన్నకొడుకు ప్రేమలో పడ్డాడని తెలుసుకున్న ఓ వ్యక్తి కొడుకు ప్రేమను తిరస్కరించి వాడి ఇష్టానికి వ్యతిరేకంగా ప్లాన్ చేసి సదరు యువతిని పిలిపించి ఆమె మెడలో తాళి కట్టి ఇంట్లో బంధించి రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడు. తమిళనాడులోని వేదారణ్యం ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఘటన ఇది.
వేదారణ్యంలో బట్టల దుకాణం నడుపుకునే నిత్యానందం కుమారుడు ముకేశ్ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న నిత్యానందం, వారిని విడదీయాలని నిర్ణయించుకున్నాడు. కుమారుడితో పెళ్లి గురించి మాట్లాడటానికి రమ్మని యువతికి కబురు పెట్టాడు. ఆమె వచ్చిన తరువాత, సెల్ ఫోన్ లాక్కుని, మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు. ఆపై అత్యాచారం చేశాడు.
రెండు రోజుల పాటు ఆమెను బంధించి, పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆపై ఆమెను తీసుకెళ్లి, తన స్నేహితుడి ఇంట్లో ఉంచాడు. తన ప్రియురాలిని తండ్రే బంధించాడని తెలుసుకున్న ముకేశ్, తన ప్రియురాలిని రక్షించుకుని, తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసును విచారిస్తున్నారు.మానవత్వం తలదించుకునేలా ఉన్న ఈ ఘటనపై పలు విమర్శలు వెలువడుతున్నాయి.