సమాజానికి మనం ఏమిస్తే అదే తిరిగి పొందుతామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లో న్యాయ శాఖ ఉద్యోగులకు అవినీతి రహిత సమాజం పై ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో ఉంటే సమాజం కూడా అదే రకమైన వాతావరణాన్ని కల్పిస్తుందని అన్నారు. అందరూ నీతి నిజాయితీలతో పనిచేస్తే సమాజం అటువంటి పరిస్థితులే అందరికీ కల్పిస్తుందని దీంతో సమాజమంతా సుఖసంతోషాలతో నిండిపోతుందని అన్నారు. ఏ విత్తనం వేస్తే అదే చెట్టు మొలకెత్తుతుందనే సామెతను ఉటంకిస్తూ న్యాయమూర్తి అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలంటే ముందు వ్యక్తి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఒకవేళ సమాజమంతా చెడు లక్షణాలతో కుళ్ళిపోతే ప్రకృతి ప్రకోపించి తగిన శాస్తి జరుపుతుందని అన్నారు. దీనికి ఉదాహరణగా న్యాయమూర్తి ఆఫ్రికా దేశంలో సుడోం గోమెరో అనే గ్రామం గురించి వివరించారు. నీతి నియమాలు మంటగలిసిన ఆ గ్రామాన్ని అగ్నికీలలు భస్మం చేశాయని తెలిపారు. మనం మంచిగా ఉంటే మంచితనానికి ప్రతిగా మంచితనమే లభిస్తుందని అన్నారు. వరకట్న దురాచారాన్ని రూపుమాపాలని మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ తమ పిల్లవానికి కట్నం తీసుకోమని ప్రతిన పూనాలన్నారు. న్యాయమూర్తుల ఒకానొక సమావేశంలో ఒక కేరళ న్యాయమూర్తి తమ రాష్ట్రంలో అవినీతి ఉండదని సగర్వంగా ప్రకటించారని, అటువంటి ఉత్తమ లక్ష్యం దిశగా మనందరం పయనించాలని ఆయన ఉద్భోదించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆశ మానవ స్వభావమని, అదే అవినీతికి మనిషిని ప్రేరేపిస్తుందని అన్నారు. మనిషి యొక్క వ్యక్తిత్వం వెలకట్టలేనిదని కాబట్టి అవినీతికి పాల్పడి దానికి విలువ నిర్ణయించవద్దని ఆయన కోరారు. విలాసవంతమైన జీవితంలో సౌకర్యం ఉండవచ్చేమో కానీ నీతివంతమైన జీవితంలో సంతృప్తి నిశ్చయంగా ఉంటుందన్నారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్లు లోక్ అదాలత్ కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆర్. డానిరూత్, ఎన్. అమరావతి, కె. ఆశారాణి , ఎన్. శాంతి సోనీ, పి. మౌనిక, ఆర్. శాంతిలత, న్యాయవాద సంఘం అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, జిల్లా కోర్టు నాజర్ రాదే శ్యామ్, సాంకేతికాధికారి ఎస్. ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.