సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరిట యువతిని నమ్మించి ఆమె వద్ద నుండి 5 లక్షల రూపాయలు తీసుకొని వేధింపులకు పాల్పడుతున్న ఒక వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి గీత ప్రసాద్ మూడు నెలల క్రితం మురళీనగర్ ప్రాంతంలో గీతాలయ స్టూడియోస్ స్థాపించి జూనియర్ ఆర్టిస్ట్ లు కావలని పత్రిక ప్రకటన ఇచ్చాడు.
ప్రకటనను చూసిన చిత్తూరు జిల్లా తిరుపతి కి చెందిన బత్తుల ప్రభావతి సంప్రదించగా సినిమాల్లో సైడ్ క్యారక్టర్ ఆవకాశం కల్పిస్తానని నమ్మించాడు. మురళీనగర్ ప్రాంతంలో ఒక అపార్ట్ మెంట్ లో ఆమెను ఉంచి షూటింగ్ నిర్వహించాడు. ఈ క్రమంలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిందని ప్రభావతి ని నమ్మించి ప్రస్తుతానికి 5 లక్షలు కావాలని పలు దఫాలుగా గీత ప్రసాద్ 5 లక్షలు తీసుకున్నాడు.
గీత ప్రసాద్ తీరుపై అనుమానం వచ్చిన ప్రభావతి అతడిని నిలదీసింది. దీనితో గీత ప్రసాద్ తనపేరు మీద ఉన్న స్టుడియోను ఆమె పేరు మీద రాసిచ్చాడు. అయితే స్టుడియో ఖాళీ చేయాలని గీత ప్రసాద్ స్నేహితులు సత్యనారాయణ, షరీఫ్, కే.పి సారధి బెదిరింపులకు పాల్పడటంతో ప్రభావతి నేరుగా వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి జి.స్వరూపరాణి కి ఫిర్యాదు చేశారు.
ఏసిపి సూచనల మేరకు కంచరపాలెం పోలీసులు గీత ప్రసాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చివరకు పోలీసులు గీత ప్రసాద్ తో పాటుగా అతడి స్నేహితులు షరీప్, సత్యనారాయణ లను ఆరెస్ట్ చేసి రిమాండు కు తరలించినట్లు వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి జి.స్వరూపరాణి తెలిపారు.