ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం కలిసికట్టుగా ఉద్యమించి కేసీఆర్ ను గద్దె దించుదామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్ భవనంలో నిర్వహించిన ‘ఉద్యమకారులరా.. కలిసి మాట్లాడుకుందాం రండి.. రౌండ్ టేబుల్ సమావేశం’ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కరి వల్లే రాలేదని, సబ్బండ వర్గాల ఉద్యమం, ఆత్మ బలిదానాలతో సాకరమైందన్నారు. తెలంగాణలో అస్తిత్వానికి భద్రత లేదన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు తొత్తులకు కాంట్రాక్ట్ లు అప్పజెప్పుతున్నారన్నారు. సమస్యలపై అడిగితే కేసులు పెడుతున్నారని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు భంగపడ్డారన్నారు. సమస్యల ప్రాతిపదికన కొట్లాడితే తప్ప ఈ ప్రభుత్వం మారదన్నారు. కేసీఆర్ కామారెడ్డి నుంచే పోటీ చేస్తున్నందున ఆయనను ప్రశ్నించే అవకాశం లభించిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కామారెడ్డి అని, ఇప్పుడు ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఇక్కడినుంచే ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు. పదేళ్లు భరించినం.. ఇక వద్దు. వెళ్లి నీ ఫామ్ హౌస్ లో కూర్చో.. అని ప్రకటించే సమయం ఆసన్నమైందన్నారు.
previous post