వేములవాడ నియోజకవర్గంలోని కోనరావు పేట మండలం నాగరాంలో రూ. 36 లక్షల వ్యయంతో పునఃనిర్మించనున్న కోదండ రామాలయ విగ్రహా ప్రతిష్ట, ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పాల్గొన్నారు.
అంతకుముందు ప్రముఖ శైవాలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు ఉన్నారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… వీటీడీఏ ఆద్వర్యంలో పేదల దేవుడు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని, భక్తుల మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే రూ. 100 కోట్లు వెచ్చించి భూసేకరణ, ఇతరత్రా అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు పాలకమండలి నియమించామని తెలిపారు. మిగిలిన ఆలయాల పాలక మండళ్ళ నియామకంపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
భగవంతులని ఆశీస్సుల వల్ల సకాలంలో సంవృద్దిగా వానలు కురుస్తున్నాయని, పంటలు పుష్కలంగా పండుతున్నాయని తెలిపారు. సీయం కేసీఆర్ కృషితో సాగునీటి కష్టాలు తీరాయని, రైతులు ఎంతో మేలు జరిగిందని చెప్పారు.