తుపాకితో కాల్పులు జరిపి రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి భారీగా నగదు దోచుకుని పారిపోయిన దుండగులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సిద్దిపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో జనవరి 31 న ఈ దోపిడి సంఘటన జరిగిన విషయం తెలిసేందే.
జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించింది. సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వకుళాభరణం నరసయ్య తనకు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న 176 గజాల ఫ్లాట్ ను సిద్దిపేటకు చెందిన శ్రీధర్ రెడ్డికి అమ్మడానికి ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లారు.
శ్రీధర్ రెడ్డి 43 లక్షల 50 వేల రూపాయలు ఇవ్వగా నర్సయ్య ఆ నగదును ఒక రెడ్ కలర్ బ్యాగ్ లో పెట్టుకొని తన డ్రైవర్ పరశురాములు కు ఇచ్చి రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆఫీసులోనికి వెళ్ళాడు. డ్రైవర్ క్యాష్ బ్యాగును ఇన్నోవా కార్ లో పెట్టుకొని తన యజమానికొరకు వేచి చూస్తూ ఉండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వచ్చి ఇన్నోవా లో కూర్చుని ఉన్న డ్రైవర్ ను డబ్బులు ఇవ్వమని బెదిరించారు.
తుపాకీతో డ్రైవర్ పర్ష రాములు పై కాల్చి డబ్బులు దొంగలించు కొనిపోయారు. ఫిర్యాదు మేరకు సిద్దిపేట ఒకటవ టౌన్ లో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి 15 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి అన్నీ కొణాలలో పరిశోధన చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు.
నిన్న ఉదయం ఎడమ సాయి కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను నేరం అంగీకరించి తనకు సహకరించిన వారి పేర్లను చెప్పాడు. దాంతో గజ్జె రాజు, బలింపురం కరుణాకర్, బిగుళ్ల వంశీకృష్ణ లను కూడా అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి చోరీ సొత్తును, నేరం చేయడానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీన పరుచుకున్నారు.
నిందితుల వద్ద నుండి నగదు ₹ 34,00,000/-, రెండు మోటార్సైకిళ్లు పల్సర్, ఫ్యాషన్ ప్రో, ఒక కారు TS08UG-5175 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ అధికారి వన్ టౌన్ సీఐ బిక్షపతి, సిద్దిపేట, గజ్వేల్ ఎసిపిలను జిల్లా ఎస్ పి అభినందించారు.