ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో నేటినుండి పేదలకు ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. డిసెంబర్ వరకూ కేంద్రం ఇచ్చిన ఐదు కిలోలకు అదనంగా రాష్ట్రం సొంతంగా భారం భరించి అన్ని కార్డుదారులకు పది కిలోలు ఉచితంగా ఇచ్చిందని ఈ జనవరి నుండి కేంద్ర నిర్ణయం ప్రకారం ఇవ్వడానికి సాప్ట్వేర్ మాడిఫికేషన్ చేయాల్సి వచ్చిందని తెలియజేసారు.
గతంలో పిఎంజీకేఏవై కింద కేంద్రం ఆలస్యంగా నిర్ణయం వెలువరించడం వల్ల 2021 మే నుండి 2022 డిసెంబర్ వరకూ 20 నెలలకు ఒక్కో యూనిట్కి 200 కేజీలకు బదులు 203 కేజీలు అదనంగా ఇచ్చామని, తద్వారా 2021 మే, 2022 మే, జూన్ మాసాలలో రాష్ట్రం అదనంగా పంపిణీ చేసిన ఒక్కో కిలోని ఈ జనవరి నుండి మార్చి వరకూ సర్ధుబాటు చేయడంతో 2023 మార్చి వరకూ ఒక్కో యూనిట్కి ఐదు కిలోలు ఆ తర్వాత 2023 ఎప్రిల్ నుండి యదావిదిగా 6కిలోలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రం స్థిరంగా అందజేసే యూనిట్కి 6కిలోలను కుటుంభ సభ్యుల పరిమితి లేకుండా యదా కోటా ప్రకారమే పంపిణీ చేస్తున్నామని, ప్రజలను ఎలాంటి తికమకకు గురిచేయవద్దని మంత్రి సూచించారు.
ఓవైపు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి పేదలు నిత్యం వాడుకునే వాటి ధరల్ని పెంచుతూ వారి నడ్డీ విరిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఉచిత బియ్యంపై మాట్లాడటం హాస్యా స్పదమన్నారు. కరోనా సంక్షోభంలో పేదలకు ఉచిత బియ్యంతో పాటు రెండునెల్ల పాటు 1500 రూపాయలు, వలసకార్మికులకు సైతం 5వందల రూపాయలు అందించామన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కేవలం 54 లక్షల 48 వేల కార్డులకు మాత్రమే రేషన్ 5కిలోల చొప్పున అందిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వందల కోట్ల భారం భరిస్తూ మరో 92 లక్షల మందికి సొంతంగా 6కిలోలు బియ్యం పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు మంత్రి గంగుల కమలాకర్.