కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. దిల్లీలో, హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కూర్చుని మాట్లాడితే ఏం తెలుస్తుందని, గ్రామాల్లోకి వెళ్లి చూస్తే కాళేశ్వరం ఫలితాలు కళ్లకు కనిపిస్తాయన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు పనులు మరో ఐదేళ్లయిన పూర్తి చేయలేరన్నారు.‘‘పోలవరం పనుల పురోగతిపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడానని, మరో ఐదేళ్లలో పూర్తయితే గొప్పేనని చెప్పారు. కాళేశ్వరం కంటే ముందే పోలవరం పనులు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఆ ఫలితాలు తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి. కానీ, కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు పోలవరం మాత్రం పూర్తి కాలేదు. ఆ ఫలితం ప్రజలకు అందలేదు. కాళేశ్వరం గురించి ప్రతిపక్ష నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ఫలాలు అందుకుంటున్న మనం ఆ అబద్ధాలను తిప్పికొట్టి కాళేశ్వరం గొప్పతనాన్ని చాటిచెప్పాలి’’ అని హరీశ్రావు పిలుపునిచ్చారు.
previous post
next post