విశాఖపట్నం అరకు ప్రాంతం నుండి బీహార్ ఉత్తరప్రదేశ్ కు అక్రమంగా తరలి పోతున్న సుమారు కోటి రూపాయల విలువ గల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ గంజాయి అక్రమ రవాణా వివరాలు అందించారు. విశాఖపట్నం అరకు నుండి బీహార్, ఉత్తరప్రదేశ్ పన్నెండు చక్రాలు లారీలో భారీగా గంజాయి రవాణా జరుగుతున్నదనే పక్కా సమాచారంతో రాష్ట్ర సరిహద్దుల్లో ని ఇచ్చాపురం సమీపంలోని పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా, చార్కోల్ లోడుతో వెళ్తున్న లారీలో గంజాయి ను గుర్తించారు.
గుర్తించిన వెయ్య యాభై కేజీల గంజాయి బహిరంగ మార్కెట్లో సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ అమిత్ వెల్లడించారు. ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ గంజాయి అక్రమ రవాణాకు స్థానికుల సహకారం ఉందని తమ దర్యాప్తులో తేలిందని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాశిబుగ్గ డి.ఎస్.పి ఎం శివరామిరెడ్డి, ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు, పట్టణ ఎస్ఐ వి సత్యనారాయణ, రూరల్ ఎస్ఐ హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు.
– సుకుమార్ పుల్లేటికుర్తి