ఒంగోలులో ఎస్ఈబి అధికారులు గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టి ఓ లాడ్జిపై దాడి చేయడంతో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి… గంజాయి కొనుగోలు, అమ్మకాలు, సరఫరా మొత్తం విద్యార్ధులే చేస్తున్నట్టు గుర్తించారు. ఓ నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు జట్టుగా ఏర్పడి ఒంగోలులోని ఓ లాడ్జిలో మకాం వేసి గత కొన్నాళ్లుగా గంజాయి అక్రమ దందా చేస్తున్నట్టు గుర్తించారు. నగరంలో ఆసుపత్రులతో బిజీగా ఉండే 60 అడుగుల రోడ్డులోని యలమంద రెసిడెన్సీని ఈ గంజాయి ముఠా వేదికగా చేసుకున్నారు.
ఇక్కడ ఒక రూం తీసుకుని అక్కడి నుంచే గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. తమ దగ్గర ట్రైనింగ్ కోసం వచ్చిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ను ఇంజనీరింగ్ విద్యార్ధి ముసుగులో లాడ్జి దగ్గరకు పంపించారు. అక్కడ గంజాయి అమ్ముతున్నవారిని మాటల్లో పెట్టి తాను ఇంజనీరింగ్ విద్యార్దిగా పరిచయం చేసుకుని ఎలాగోలా పది గ్రాముల గంజాయిని 500 రూపాయలకు కొనుగోలు చేశారు. తమ అంచనా కరెక్ట్ అని తేలడంతో వెంటనే ఎస్ఈబి సిఐ లత ఆద్వర్యంలో సిబ్బంది లాడ్జిపై దాడి చేసి గంజాయి అమ్ముతున్న విజయవాడకు చెందిన దోరేపల్లి పవన్, ఒంగోలుకు చెందిన లాల్ శ్యామ్ లను అరెస్ట్ చేశారు.
వీరి దగ్గర నుంచి లక్షా యాభైవేల రూపాయల విలువైన 2.820 కేజీల గంజాయి, బైక్, ఎలక్ట్రానిక్ కాటాను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు. విజయవాడకు చెందిన పవన్, ఒంగోలుకు చెందిన లాల్శ్యామ్ ఇద్దరూ ఒంగోలులోని ఓ ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజిలో చదివే సమయంలో క్లాస్మేట్లుగా ఉన్నారు. వీరిద్దరూ గంజాయికి అలవాటు పడి ఆ తరువాత తామే గంజాయి కొనుగోలు, అమ్మకాలు చేస్తే డబ్బులు సంపాదించవచ్చని ప్లాన్ చేశారు. వీరిలో పవన్ ఒరిస్సాకు వెళ్ళి అక్కడి నుంచి కిలోల చొప్పున గంజాయినీ తీసుకుని ఒంగోలుకు వచ్చేవాడు.
ఇక్కడ లాడ్జిలో మకాం వేసి పదిగ్రాములు, ఇరవై గ్రామలు ప్యాకెట్లను ఒక్కొక్కటి 500, వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు. అదికూడా కేవలం ఇంటర్ విద్యార్దులు, ఇంజనీరింగ్ విద్యార్ధులు, ఇతర కాలేజిల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే విక్రయిస్తున్నారు. అవసరమైతే డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. వీరిలో కొంతమందిని పలు డెలివరీ కంపెనీల్లో పార్ట్టైం ఉద్యోగులుగా చేర్పించి ఆ ఉద్యోగం చేస్తూనే గంజాయిని కూడా డోర్ డెలివరీ చేస్తున్నట్టు గుర్తించామని ఒంగోలు ఎస్ఈబి అధికారి శ్రీధర్ తెలిపారు.