జాతీయ స్ఫూర్తి నింగికెగసింది. జాతీయ పతాకంలోని మూడురంగుల బెలూన్లు నీలాకాశంలో రెపరెపలాడాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ లో నిర్వహించిన తిరంగా ర్యాలీ, దేశ భక్తిని చాటిచెప్పింది. ఇంటింటికీ జాతీయ పతాక కార్యక్రమం కలెక్టరేట్ వద్ద ఘనంగా ప్రారంభమయ్యింది.
ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాల మేరకు, డిర్డిఏ, మెప్మా, స్త్రీశిశు సంక్షేమం, వైద్యారోగ్యశాఖల సిబ్బంది నిర్వహించిన తిరంగా ఉత్సవ ర్యాలీని స్థానిక చెన్నారెడ్డి భవనం వద్ద, డిఆర్డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి ప్రారంభించారు. మహాత్మా జ్యోతిభా పూలే విగ్రహం మీదుగా ఈ ర్యాలీ కలెక్టరేట్ చేరుకుంది. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం నిర్వహించి, మువ్వన్నెల బెలూన్లను ఎగురవేశారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ గణపతి రావం మాట్లాడుతూ, జాతీయ స్ఫూర్తిని రగిల్చేందుకు, ప్రతీఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో దేశం ఎంతగానో అభివృద్ది చెందిందన్నారు. మరో 25 ఏళ్లలో అన్ని రంగాల్లో మరింత అభివృద్దిని సాధించి, వందేళ్ల ఉత్సవాలను నిర్వహించేందుకు ఈ తిరంగా ఉత్సవం మనకు ప్రేరణ ఇస్తుందని పేర్కొన్నారు.
స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ బి.పద్మావతి మాట్లాడుతూ, అందరూ మహిళలే పాల్గొన్న ఈ తిరంగా ర్యాలీ స్త్రీ శక్తిని చాటిచెప్పిందన్నారు. మహిళల చైతన్యానికి, దేశభక్తికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మూడు రోజులూ ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. డిఆర్డిఏ పిడి కల్యాణ చక్రవర్తి, మెప్మా పిడి సుధాకరరావు మాట్లాడారు. ఆజాదీకా అమృత మహోత్సవాల ప్రాధాన్యతను, జాతీయ జెండాను గౌరవించే విధానాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి బి.శాంతకుమారి, జిల్లా యువన సంక్షేమాధికారి విక్రమాధిత్య, డిఆర్డిఏ ఎపిడి సావిత్రి, ఇతర సిబ్బంది, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, ఆర్పిలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.