జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి సాధించడంతో భారీ స్థాయిలో నిషేధిత అంబర్ గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
లారీలో గుట్కా సరఫరా అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 3 గంటల నుండి ఇచ్చోడ సీఐ కంప రవీందర్ ఎస్సై ఎల్ ప్రవీణ్ ఆధ్వర్యంలో బెల్లూరి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేపడుతుండగా హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఐచర్ వాహనం తనిఖీలు చేపడుతున్న పోలీసులను చూసిన డ్రైవర్ వాహనంను వెనక్కి తిప్పి బెల్లూరి గ్రామం వైపు పోనిచ్చాడు.
గమనించిన పోలీసులు వెంటనే వెంబడించి గ్రామంలో ప్రవేశించడంతో MH 26AD 1706 నెంబర్ గల ఐచర్ వాహనంను నిలిపివేసి నిందితులు పరారయ్యారు. తనిఖీలు చేపట్టగా 100 బ్యాగులో రూ.17.50 లక్షల విలువైన నిషేధిత అంబర్ ప్యాకెట్లు ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి గుట్కా ప్యాకెట్లు, ఐచర్ వాహనం స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి అనంతరం సిఐ ఇచ్చోడ ఎస్సై లు కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
కేసు పూర్తిగా దర్యాప్తు చేసి అసలు నిందితులను పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని అతని వివరాలు సేకరించామని తెలిపారు. సీఐ కంప రవీందర్ ఆధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహరించి భారీ ఎత్తున గుట్కా స్వాధీనం చేసుకున్నందుకు జిల్లా ఎస్పి ఎం రాజేష్ చంద్ర, ఉట్నూర్ డిఎస్పీ ఎన్ ఉదయ్ రెడ్డి అభినందనలు తెలిపినట్లు వివరించారు.