ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని టాకీగూడ గ్రామంలో భారీ ఎత్తున గుట్కా నిల్వలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఇంచార్జ్ ఎస్ఐ బుద్దే మల్లేష్ ఆధ్వర్యంలో ఏఎస్సై రహమాన్ ఖాన్ తో కలిసి గ్రామంలో తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు టాకీగుడా గ్రామానికి చెందిన చౌహాన్ తుఫాన్ (27) గా గుర్తించారు. అతని ఇంట్లో రూ.4 లక్షల 38 వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
నిందితుడిని అదుపులో తీసుకొని విచారించగా కెరమెరి మండల కేంద్రానికి చెందిన ప్రధాన నిందితుడు రాయల గణపత్ (32) అనే అతను కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా నుండి ఇటీవలే దిగుమతి చేసుకోని, పోలీసులు అడుగడుగునా తనిఖీలు ఉండడంతో టాకీగుడా గ్రామంలో నిల్వ ఉంచి ఆదిలాబాద్ పట్టణంలో చిన్న వ్యాపారులకు సరఫరా చేయడానికి దాచి ఉంచినట్లుగా తెలిపారు.
అనంతరం స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు, నిందితుని అదుపులో తీసుకొని గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామంలో తనిఖీల సమయంలో ఏఎస్సై రెహమాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారని ఎస్ఐ తెలిపారు.
ప్రధాన నిందితున్ని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్సై కాతిలే రమేష్, కానిస్టేబుళ్లు జే. భూమన్న, లక్ష్మన్న మహిళా కానిస్టేబుల్ కే. స్వరూప తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర గుడిహత్నూర్ పోలీసులను అభినందించారు.