సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టులు మొట్టికాయలు వేయడం వల్లే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉచితంగా కరోనా టీకా ఇవ్వడానికి ముందుకు వచ్చిందని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని CPM పార్టీ కార్యాలయంలో మంగళవారం కృష్ణ పట్టి ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ సమావేశంలో రోషపతి పాల్గొని మాట్లాడారు.
కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలనకి,రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనకి ఎదురు చెప్పే ప్రతిపక్ష పార్టీలు లేకుండా పోవడంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అయిందని ఆయన అన్నారు.
అందుకే ఈ సమయంలో అత్యున్నత న్యాయస్థానం క్రియాశీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూన్ 1 నుండి 10 వరకు ఆల్ ఇండియా CITU కమిటీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
ఇందులో భాగంగా ఈ నెల 10న జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రోషపతి పిలుపునిచ్చారు. కార్మికులతో వెట్టి చాకిరి చేయించే 4 కార్మిక కోడులను రద్దుచేయాలని, 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనం నెలకి 24000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అసంఘటిత రంగ కార్మికులకు నెలకి 7,500 చొప్పున ఇవ్వాలని, రేషన్ కూడా ఇవ్వాలి డిమాండ్లతో జరిగే ఈ నెల 10వ తేదీన అన్ని మండల,పట్టణ,పరిశ్రమ ప్రాంత కేంద్రాల్లో పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు తీగల శ్రీను,అజరుద్దీన్, గణపతి,ప్రభాకర్,హనుమానాయక్,మధు, ఉపేందర్,బాలకృష్ణ, ప్రభుదాసు,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.