ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాలలో యోగా ఒకటి అని ఏపీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా ఆదివారం నాడు రింగ్ రోడ్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో విజినిగిరి యోగ చైతన్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే కోలగట్ల జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఉపయోగపడే ప్రక్రియలో యోగ ఒకటి అని అన్నారు. యోగ వల్ల క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. యోగా వల్ల మానసిక సామర్థ్యం కూడా పెరుగుతుందని అన్నారు. చిన్నప్పటినుంచి తనకు స్విమ్మింగ్ అలవాటు ఉండేదని, ఈ వయసులో కూడా తాను స్విమ్మింగ్ చేస్తున్నాను అని అన్నారు.
మంచి ఆలోచన గల వ్యక్తులు ఉంటే తప్పక ఆ సమాజం అన్ని విధాలా బాగుంటుందని అన్నారు. సమాజం బాగు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాను రాజకీయవేత్తను కాదని, సమాజ సేవకుడు అని అన్నారు.
మున్సిపాలిటీ స్కూల్లో కూడా పిల్లలకు యోగా అభ్యసించే చే విధంగా తగు చర్యలు చేపడతామని, విద్యా కమిటీ చైర్మన్ మరియు నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి కి తగు సూచనలు చేశారు. సంస్థ చేపట్టే ప్రజాహిత కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ ఎం పద్మ కుమారి లు మాట్లాడుతూ మనిషి మానసిక, శారీరక ప్రశాంతతకు , ఆరోగ్యానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మనసుని, శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మికత అందించేది యోగా అని అన్నారు. భారతదేశంలో వేదకాలం నుంచి యోగా ఉందని వేదాలు చెబుతున్నాయి అని అన్నారు.
యోగ చైతన్య సంస్థ ఉపాధ్యక్షులు పి రవీంద్ర నాథ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దిశ డిఎస్పి టీ.త్రినాధ్ తో పాటు యోగ శిక్షకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఉషా అతిథులను ఉచిత రీతిన సత్కరించారు. సంస్థ ఉపాధ్యక్షులు పి రవీంద్ర నాథ్ దంపతులను కూడా ముఖ్య అతిథుల చేతుల మీదుగా సత్కరించారు.