వైకుంఠ ఏకాదశి సందర్బంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా “గిరిప్రదక్షిణ” వైభవంగా జరిగింది. ప్రధాన ఆలయం నుండి సీతారాముల విగ్రహాలను మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పల్లకిలో గిరిప్రదక్షిణలో ఊరేగించారు. కార్యక్రమం రూపకర్త, ఆనందాశ్రమం స్వామీజీ, సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి రామగిరి మెట్లవద్ద కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.
శ్రీరామ నామ స్మరణతో రామగిరి హోరేత్తింది. వేలాది భక్తజన సందోహం స్వచ్చందంగా రామగిరి చుట్టూ శ్రీరామ నామ స్మరణతో ప్రదక్షిణ చేయడం విశేషం. స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో రామతీర్థం సేవా పరిషత్ వ్యవస్థాపకులు జ్యోతిప్రసాద్, భజన సంఘం ప్రతినిధి నర్సింగరావుల పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.
రెండు కోలాటం ప్రదర్శలు మాత్రమే పాల్గొన్నప్పటికి, లయబద్దంగా భక్తుల శ్రీరామ నామస్మరణ హైలెట్ గా నిలిచింది.గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వారితో పాటు, ముక్కోటి ఏకాదశి దర్శనాలు చేసుకున్న వేలాది మంది భక్తులకు దేవస్థానం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ట్రస్ట్ బోర్డు సభ్యులు తిరుమరెడ్డి శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేవస్థానం కార్యనిర్వాహనాధికారి పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అర్చకులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అయితే గిరిప్రదక్షిణ జరిగే మార్గం శుభ్రం చేయకపోవడంతో పాటు, ప్రచారం నిర్వహించక పోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.