ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్ర మైన గుజరాత్ లో అత్యంత దారుణమైన, అమానవీయమైన సంఘటన జరిగింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన దారుణమైన సంఘటన ఇది. గుజరాత్ లోని ఒక కాలేజీలో అమ్మాయిలు బహిష్టు అయ్యారో లేదో తెలుసుకోవడానికి వారి లోదుస్తులు విప్పి చూసిన అత్యంత దారుణమైన, హేయమైన ఘటన జరిగింది.
భుజ్ లోని శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇన్ స్టిట్యూట్ లో నిన్న ఈ ఘటన జరిగినట్లు అహ్మదాబాద్ మిర్రర్ అనే పత్రిక రిపోర్టు చేసింది. కొందరు బాలికలు బహిష్టు సమయంలో మత ఆచారాలను ఉల్లంఘించారని వారు నివసిస్తున్న బాలికల హాస్టల్ వార్డెన్ కాలేజీ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో ఆ బాలికల అండర్ వేర్ లను విపి చూశారు. అక్కడి మతాచారాల ప్రకారం బహిష్టు లో ఉన్న బాలికలు అక్కడి దేవాలయంలోకి ప్రవేశించకూడదు. అంతే కాదు అక్కడ ఉన్న వంట శాలలోకి కూడా వారు ప్రవేశించకూడదు.
దీన్ని ఉల్లంఘించారని ఆ బాలికలను ఘోరంగా అవమానించారు. ఈ సంఘటనపై ఇప్పటి వరకూ పోలీసులకు ఫిర్యాదు అందలేదు. తన గుర్తింపను చెప్పడానికి ఇష్టపడని ఒక అమ్మాయి ఆ పత్రిక విలేకరికి ఫోన్ చేసి తమకు జరిగిన అవమానాన్ని చెప్పారు. క్లాస్ రూం నుంచి బయటకు వెళ్లి 19 మంది లైన్ లో నిలబడాలని కాలేజీ యాజమాన్యం అడిగింది.
వారంతా క్యూలో నిలబడిన తర్వాత ప్రిన్సిపాల్ వచ్చి ఆ బాలికలతో అసభ్యంగా మాట్లాడారు. బహిస్టులో ఉన్నారో లేదో చూపించాలని ప్రిన్సిపాల్ వారిని ఆదేశించారు. అందుకు ఆ బాలికలు మొహమాటపడుతుండగా ప్రిన్సిపాల్ వచ్చి బట్టలు విప్పి లో దుస్తులు కూడా తీసేయమని ఆదేశించారు. ఆ 19 మందిలో ఇద్దరు తాము బహిష్టు సమయంలోనే ఉన్నట్లు చెప్పారు. దాంతో వారిని బాత్ రూం కు తీసుకువెళ్లారు.
మిగిలిన వారి అండర్ వేర్ లు విప్పి చూశారు. పోలీసులకు ఫిర్యాదు చేయదలచుకుంటే హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయి ఇవ్వవచ్చునని కాలేజీ యాజమాన్యం చెప్పింది. అంతే కాకుండా ఆ బాలికలతో ఒక లేఖ రాయించుకున్నారు.
తమకు ఎలాంటి అవమానం జరగలేదని ఎలాంటి సంఘటన జరగలేదని ముందే లేఖ రాయించుకున్నారు. ఈ విషయాన్ని కాలేజీ ట్రస్టీ పి హెచ్ హిరణి వద్ద ప్రస్తావించగా బాధ్యులపై చర్య తీసుకుంటామని అన్నారు. బాధ్యులపై చర్య తీసుకుంటామని యూనివర్సిటీ ఇన్ చార్జి దర్శన డోలకీయ తెలిపారు.