సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో గత నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ధనుర్మాస తిరుప్పావై కార్యక్రమాలు ముగిసిన శుభ సందర్భంగా బుధవారం శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధన, యజ్ఞోపవీత ధారణ, పాద ప్రక్షాళన, శుభముహూర్తమునకు జిలకర బెల్లం ధారణ, మాంగల్య పూజ, మాంగల్య ధారణ, తలంబ్రాల ఘట్టంతో అర్చక స్వాములు శాస్త్రోక్త విధంగా నిర్వహించారు.
ఈ కళ్యాణ ఘట్టంలో విష్ణు సహస్రనామార్చన, గోదాదేవి అష్టోత్తరం, రామానుజ అష్టోత్తరం, తిరుప్పావై సేవాకాలం, మంగళాశాసనం, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. తదనంతరం నీరాజనం మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు.
విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని సేవించారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానాచారి రంగాచార్యులు, శ్రీనివాసాచార్యులు, దామోదరాచార్యులు, కె వి ఎన్ మూర్తి, వంకాయల నరసింహారావు, బాచిమంచి గిరిబాబు, పొనుగుపాటి అశోక్,అనంతరాములు, గుండా రమేష్, వాసుదేవరావు, పణికుమారి, బెల్లంకొండ సైదులు, దేవస్థాన అర్చకులు నరగిరినాధుని భాస్కరాచార్యులు, నరగిరినాధుని నరసింహాచార్యులు, నరగిరినాధుని మురళీ కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.