కరోనా లాక్ డౌన్ కారణంగా వ్యాపార సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. లాక్ డౌన్ అమలులో ఉన్నన్ని రోజులు మెడికల్, కిరాణం లాంటి అత్యవసర దుకాణాలు మాత్రమే వ్యాపారాలు నిర్వహించారు. మిగతా వ్యాపార సంస్థలు మూసి వేయడంతో యజమానులు తీవ్ర నష్టాలను చవి చూశారు.
వీరి పరిస్థితిని గమనించిన దుకాణాల భవన యజమాని లాక్ డౌన్ కాలానికి మొత్తం 40 రోజుల అద్దె మాఫీ చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీకి చెందిన మాజీ ప్రొఫెసర్ ముప్ప నరసింహ రెడ్డికి స్థానికంగా ముప్పా కాంప్లెక్స్ పేరుతో భవన సముదాయం ఉంది.
ఈ కాంప్లెక్స్ లో 15 భవనాల్లో వ్యాపారస్తులు వివిధ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. కరోనా వైరస్ విజృంభనతో దేశవ్యాప్తంగా మార్చ్ 22 నుండి లాక్ డౌన్ ప్రకటించగా ఏప్రిల్ నెలాఖరు వరకు పలు సడలింపుల మధ్య దుకాణాలు తెరుచుకున్నాయి.
ఈ మధ్య కాలానికి అన్ని దుకాణాలకు చెందిన సుమారు రూ. 2 లక్షల ను నర్సింహారెడ్డి మాఫీ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సహృదయంతో ఆయన తీసుకున్న నిర్ణయానికి వ్యాపారస్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అద్దెను మాఫీ చేసిన నర్సింహారెడ్డి దంపతులను సదరు వ్యాపారస్తులు శాలువాతో సన్మానం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.