‘‘పండు కోసం పువ్వు వికసిస్తుంది
పండు వచ్చినప్పుడు.. పువ్వు వాడిపోతుంది.
కస్తూరి.. జింకలోనే ఉంది..
కానీ అది గడ్డి అన్వేషణలో తిరుగుతుంటుంది..’’
– సంత్ కబీర్ దాస్ (15 వ శతాబ్దం)
నిజమే..జింక మాదిరి..మనం సంకల పిల్లను పెట్టుకోని వూరంత దోలాడుతుంటం. అన్నీ మనలోనే వున్నా వాటిని వొదిలిపెట్టి ఇంకేందో కావాలనే దేవులాట. ఈ దోలాటే..మనిషికి కిక్కునిస్తట్టుంది. అయితే..ప్రాకృతిక భావనాత్మక వాస్తవ ప్రపంచాన్ని వొదిలి..రోజు రోజుకూ కృత్రిమత్వపు వస్తు ప్రపంచాన్ని నింపుకుంటున్న మనిషి..తన దేహంలో మనసులో దేన్ని నింపుకోవాల్నో దేన్ని వొంపుకోవాల్నో తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అవుతుండడమే అసలు సమస్య.
ఈ సమస్యనుంచి క్షణం క్షణం బయటపడే తన్లాటే.. గోరేటి పద్యం పాట ఆట.
మహాకవి కబీర్ సూఫీ తాత్విక పరంపరకు గోరేటి వో కొనసాగింపు.
సూఫీ భక్తికవి కబీర్ దాస్ పేర.. కబీర్ సమ్మాన్…ప్రతిష్టాత్మక అవార్డును..తెలంగాణ ప్రజావాగ్గేయకారుడు గోరెటి వెంకన్నకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం…నాటి కబీర్ దాస్ తాత్వికతను తిరిగి యాదిచేసుకోవడమే.. కబీర్ దాస్ సూఫీ తాత్వికతను నింపుకున్న తెలంగాణకు దక్కిన అసలైన గౌరవమిది.
రమేష్ హజారి