పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. కర్ఫ్యూ అమలులోకి వచ్చిన కొద్ది సేపటికే హైదరాబాద్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దుకాణాలన్నీ రాత్రి 8గంటలకే మూసివేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ షాపింగ్, దుకాణాలను మూసివేశారు.
పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్ సిటీ సెంటర్, జీవీకే మాల్, సినీమాక్స్ మూతపడ్డాయి. సినిమా థియేటర్లు, పబ్లు, బార్లు, మద్యం దుకాణాలను కూడా రాత్రి 8గంటలకే మూసివేయించారు.
అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. కర్ఫ్యూ అమల్లోకి రావడంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
ఇతర ప్రాంతాల నుంచి ఇప్పుడే హైదరాబాద్ చేరుకున్న వారు వాహనాలులేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా ఆటోలు ఎక్కువ చార్జీలు డిమాండ్ చేస్తున్నాయి.