ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న ప్రసవాల పై వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
జిల్లా కేంద్రం లోని ఏరియా ఆసుపత్రి అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో గర్భిణీల నమోదు, జరుగుతున్న ప్రసవాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అధిక సంఖ్యలో ప్రసవాలు జరగేలా డాక్టర్లు, ఏఎన్ ఎంలు, ఆశాలు కృషి చేయాలనీ అన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలని అందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై పూర్తి నమ్మకం కలిగేలా డాక్టర్లు పని చేయాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం జరిగితే కెసిఆర్ కిట్ తో పాటు మగ శిశువు అయితే రూ. 12000/- ఆడ శిశువైతే 13000/- నగదు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలకు వెళ్లి ఆర్థికంగా నష్ట పోవద్దని ప్రజలకు వైద్యసిబ్బంది అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.వసంతరావు, చివరి ఆరు బుధవారం జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డా. దేవేందర్ రెడ్డి, డా.కార్తీక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.