దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో సహకార సంఘ పరిధిలో ఏర్పాటు చేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో 340 వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులకు ఎన్ని అవసరం అయితే అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ అదేశించారని చెప్పారు.
రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేసినట్టుగా తమ నోటీసుకు వస్తే రైస్ మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొక్కజొన్న వద్దని చెప్పినా రైతులు నష్టపోకుండా మొక్కజొన్న వేసిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.
వాస్తవానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే మొక్కజొన్న కొనుగోలు చేయాల్సి ఉన్నా అలా చేయకుండా బీజేపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ధాన్యం కొనుగోలు చేయడం గాని, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ కు రైతులంటే అపారమైన ప్రేమ అని చెప్పారు. అనంతరం చైర్మన్ కు సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కపిల్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు