పోడు భూముల హక్కు పత్రాల విషయమై గ్రామ సభలు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపిడివో లు, రెవిన్యూ, అటవీ అధికారులతో పోడు భూముల గ్రామ సభల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియ సజావుగా, క్రమబద్ధంగా నిర్వహించడంపై అధికారులను అభినందించారు. జిల్లాలో 94 గ్రామ పంచాయతీల్లోని 132 ఆవాసాల్లో హక్కుల కోసం 18295 దరఖాస్తులు వచ్చినట్లు, 17616 దరఖాస్తులు పరిశీలన పూర్తయినట్లు కలెక్టర్ అన్నారు. మిగులు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. గ్రామ సభల నిర్వహణ సోమవారం నుండి ప్రారంభించాలని ఆయన తెలిపారు. సోమవారం మొదటి రోజున ఒక్కో ఆవాసం నుండి ఒక్కో గ్రామ సభ నిర్వహించాలని, ఎక్కడ నిర్వహించేది ఆవాసం పేరు, ప్రదేశం ముందస్తుగా టాం టాం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
గ్రామ సభ షెడ్యూల్ విషయమై సంబంధిత ఎస్ హెచ్ఓ కి సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామ సభ ఎక్కడి నుండైతే దరఖాస్తులు వచ్చాయో, ఎఫ్ఆర్సి ఏ ఆవాసంలో ఉందో ఖచ్చితంగా అక్కడే నిర్వహించాలన్నారు. గ్రామ సభకు ఆయా ఆవాసంలో ఉన్న ఓటర్లందరూ సభ్యులేనని ఆయన తెలిపారు. కోరం ఉంటేనే గ్రామ సభ నిర్వహించాలన్నారు. రికార్డులు పకడ్బందీగా చేపట్టాలన్నారు. గ్రామ సభ తీర్మానం చెల్లుబాటు అవుతుందన్నారు. తిరస్కరణకు కారణాలు నమోదు చేయాలన్నారు. ఏ ఒక్క అర్హులైన దరఖాస్తుకు అన్యాయం జరగొద్దని, అన్ని అర్హులైన దరఖాస్తులను కవర్ చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ఐటిడిఏ పీవో గౌతమ్ పోట్రూ, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, పోడు భూముల ప్రక్రియ మండల ప్రత్యేక అధికారులు అప్పారావు, సత్యనారాయణ, కృష్ణా నాయక్, శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీఓ రవీంద్రనాథ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.