తాము పడుతున్న కష్టాలపై అన్న చెల్లెల మధ్య సాగిన సంభాషణ పాట రూపంలో ఆవిష్కృతమైంది. ఖమ్మం నగరం లోని బల్లేపల్లి కి చెందిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ స్వీయదర్శకత్వంలో రూపొందించబడిన ఆ పాట ఆడియో సిడిని ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ ప్రబుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విధ్యార్ధుల సమ్మేళనంలో ఆనాటి అధ్యాపకులు, మిత్రుల సమక్షంలో విడుదల చేశారు.
ఈ సిడి నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పరీక్షల విభాగం డైరెక్టర్, ఈ కళాశాల పూర్వ విధ్యార్ధి వడ్డనపు వాసుతో పాటు ఆనాటి మిత్రులు 100 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం ఆదివారం ఎన్ఎస్పి కాంప్ లోని డిపిఆర్సి భవనంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 30 యేళ్ళ తర్వాత కలసిన మిత్రుల సమక్షంలో ఈ పాట విడుదల కావటం అభినందనీయమన్నారు.
ఆ కళాశాలలో చదివిన అనేక మంది వున్నత స్తానాలలో వున్నారని, మోహన్ లాంటి సినీ సంగీత దర్శకునితో పాటు, నాక్ తొలి డైరెక్టర్ ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు పార్థసారధిరెడ్డి, ఖమ్మo జెడ్పి ఛైర్మన్ లింగాల కమల్ రాజు లాంటి వారు వున్నారన్నారు. ప్రతి ఒక్కరూ తమ తొలి అడుగులను కళాశాలలోనే వేశారన్నారు. కాగా మోహన్ రూపొందించిన ఈ పాటలో మోహన్ కూతురు అక్షర నేపధ్య గాయనిగా పాడిన తొలి పాట కావటం గమనార్హం.
వేలాది పాటలకు సంగీత దర్శకత్వం వహించటమే కాకుండా వందలాది పాటలను పాడిన మోహన్ ను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విధ్యార్ధులు లింగాల కమల్రాజు, వడ్డానపు వాసు, డిప్యూటీ సిఈఓ చంద్ర శేఖర్, రామకృష్ణ, మురళీకృష్ణ, శ్రీహరి, బాబా, విజయరావు తదితరులు పాల్గొన్నారు.