తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నూతనంగా మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఈ నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.
వచ్చే ఏడాది నుంచి ఒక్కో కాలేజీ వంద ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోబోతున్నది.ప్రభుత్వ తాజా నిర్ణయంతో తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య 10 వేలకు చేరువ కానున్నాయి.అంతేకాకుండా ఈ ఎనిమిది కాలేజీలు అందుబాటులోకి వస్తే జిల్లాకో మెడికల్ కాలేజ్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించనుంది.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదేళ్లలో 29 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. తాజాగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో సీఎం కేసీఆర్కు వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.