తెలుగుదేశం పార్టీ ఇంకా రాజకీయాల్లో కొనసాగుతుందని చెప్పుకోవడానికే బస్సు యాత్ర చేస్తోందని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. బస్సు యాత్రలో వాస్తవాలు చెబితే ప్రజల హర్షిస్తారని.. అవాస్తవాలు చెబితే నమ్మే స్థితిలో ఇక్కడ ఎవరూ లేరని తెలిపారు. ఈ మేరకు సోనియానగర్ టిడ్కో గృహసముదాయాన్ని ఆయన పరిశీలించిన… అనంతరం మీడియా తో మాట్లాడారు.
టిడ్కో గృహాల్లో అక్రమాలు జరిగినట్లు టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలిసీతెలియక మాట్లాడవద్దని హితవు పలికారు. సోనియా నగర్లో బలహీన వర్గాలకు ఇళ్లు కడుతున్నామని చెప్పారు. తాను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంజూరు చేసిన పట్టాలకు ఇళ్లు కట్టి ఇవ్వలేదని.. నాడు వారే జన్మభూమి కమిటీలను పెట్టుకుని, డబ్బులు తీసుకుని గృహాలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఎక్కడో విజయవాడలో ఎమ్మెల్సీ ఉద్యోగం చేసుకునే బుద్ధా వెంకన్నకు ఇక్కడ సంగతులు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు.
‘వెంకన్నా.. చిత్తశుద్ధి ఉంటే మళ్లీ విజయనగరం రా.. నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించు. లేదంటే మీ అశోక్ను విజయనగరం ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి ఆలయానికి వచ్చి.. ఫలానా చోట అవినీతి జరిగింది. కోలగట్ల లంచాలు తిన్నాడని ప్రమాణం చేయమను..’ అంటూ సవాల్ విసిరారు. నాడు మంజూరు చేసిన లబ్ధిదారుల జాబితాతో రావాలని.. సారిపల్లి, సోనియానగర్ల్లో ఒక్క ఇంటినైనా తాము మార్చామని ఎవరితోనైనా చెప్పించగలరా? అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు డబ్బులు తీసుకున్నట్లు నిరూపించండని సవాల్ చేశారు.
జూట్మిల్లులు మూసేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నట్లు అశోక్ ఆరోపిస్తున్నారని.. అసలు ఆ మిల్లులు ఎవరి హయాంలో మూతపడ్డాయని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మిల్లులు మూతపడటంతో.. వాటి యజమానులు ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే అది కూడా తామే చేసినట్లా? అని నిలదీశారు. ‘మీ చంద్రబాబు పిలుపు ఇస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావు. సారిపల్లి, సోనియానగర్ ఇళ్లలో అవినీతి జరిగినట్లు అంటున్నావు. సారిపల్లిలో ఇప్పటికే 800 ఇళ్లు లబ్ధిదారులకు అందజేసేశాం.
మరో 400 ఇళ్లు త్వరలో అందించడానికి సిద్ధం చేశాం. సోనియానగర్లో 1,100 ఇళ్లకుగానూ 300 ఇళ్లు అన్ని సౌకర్యాలూ కల్పించి త్వరలో లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికలొస్తేనే గానీ బయటకు రాని నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి. మీరు చేసిన ఆరోపణల్లో నిజమెంతో నిరూపించుకోవడానికి మేం సిద్ధం.’ అని కోలగట్ల అన్నారు. తాను గంజాయి వ్యాపారానికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అశోక్ సిగ్గుపడాలని అన్నారు.
తానేంటో, తన వ్యాపారాలు ఏమిటో ఇక్కడ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. స్వచ్ఛమైన రాజకీయ జీవితంలో ఉన్నామని, లంచాలు తీసుకోవాల్సిన గతి తమకు పట్టలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, ఫ్లోర్ లీడర్ ఎస్వీవీ రాజేష్, వైసీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, కార్పొరేటర్లు అల్లు చాణక్య, బండారు ఆనందరావు, పట్టా ఆదిలక్ష్మి, జోనల్ ఇన్చార్జిలు, టిడ్కో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.