38.2 C
Hyderabad
April 29, 2024 12: 41 PM
Slider కృష్ణ

విజయవాడ నుంచే హజ్ యాత్ర చేయండి

#hajpilgrims

రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికులకు శుభవార్త చెప్పిందని ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసల్ ఆజామ్ అన్నారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 హజ్ యాత్రికుల కోసం తామంతా సమావేశం నిర్వహించుకుని పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. గతేడాది 1100 మంది హజ్ యాత్రకు వెళ్లారని, ఈసారి రెట్టింపు చేయడంతో 3 వేల మంది వరకు వీసాలు వస్తాయనుకుంటున్నామని, వారందరినీ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయబోతున్నామని వివరించారు.

హజ్ యాత్రికుల్లో రూ. 3 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ. 60 వేలు, అంతకుపైబడి ఆదాయం ఉన్నవారికి రూ. 30 వేలు చొప్పున హాజీలకు బహుమతిగా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ పథకాన్ని కొనసాగించనున్నట్లు చెప్పడానికి సంతోషిస్తున్నామని తెలిపారు. హాజీలకు ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే దేశంలోని ఏ రాష్ట్రం వారైనా, ఏ రాష్ట్రం నుంచైనా హజ్ యాత్రకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ హాజీలు విజయవాడ విమానాశ్రయం నుంచి వెళితే వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని, ప్రభుత్వం అందించే బహుమతులు తీసుకోవచ్చని వివరించారు.

ఇక్కడి నుంచే మక్కా కూడా పంపాలని భావిస్తున్నామని, మక్కా, మదీనాలలో తమ తరఫున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. హాజీలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.విజయవాడ అంబారిగేషన్ పాయింట్ నుంచి హజ్ వెళ్లే యాత్రికులను మానిటరింగ్, ట్రాకింగ్ చేయడానికి వీలుగా ఉంటుందన్నారు. ఒకవేళ హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాల్సిన పని ఉంటుందని, అలా కాకుండా విజయవాడ నుంచి అంబారిగేషన్ పాయింట్ ఏర్పాటు చేసినందున ఇక్కడి నుంచే వెళ్లే అవకాశం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విజయవాడ అంబారిగేషన్ పాయింట్ నుంచి మూడు వేల మందికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విజయవాడలోని ఓల్డ్ టెర్మినల్ ను పూర్తిగా హాజీలకే కేటాయించి, అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ ప్రభుత్వం మైనారిటీ పక్షపాతిగా వ్యవహరిస్తోందని, గతంలో ఎవ్వరూ ఇవ్వనట్లుగా నగదు సాయం చేస్తోందని వివరించారు. అనంతరం హజ్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఏపీ నుంచి మక్కా వెళ్లే వారందరినీ విజయవాడ నుంచే పంపాలని భావిస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనలతో ఢిల్లీలో ఏవియేషన్ మంత్రి, అధికారులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రులతో మాట్లాడి విజయవాడకు అంబారిగేషన్ పాయింట్ తీసుకురావడం జరిగిందని వివరించారు. ఈ పాయింట్ రాకతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చినట్లు భావిస్తున్నామన్నారు. గతంలో హైదరాబాద్ నుంచి వెళ్లే సమయంలో ఆ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాల్సి ఉండటంతోపాటు, అరకొర సదుపాయాలతో పంపాల్సి వచ్చేదని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవతో ఈసారి అంబారిగేషన్ పాయింట్ రావడంతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయన్నారు.

మొదటి ఆప్షన్ విజయవాడ పెట్టుకోవాలని, రెండో ఆప్షన్ గా దేశంలోని ఏ పాయింట్ నైనా పెట్టుకోవచ్చని తెలిపారు. అయితే వేరే రాష్ట్రం నుంచి వెళ్లేవారికి పూర్తిగా సదుపాయాలు కల్పించలేమని, కనుక విజయవాడ నుంచే వెళ్లాలని హజ్ యాత్రికులను కోరారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి నవరత్నాల పథకం కింద చేర్చి రూ. 3 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి రూ. 60 వేలు, ఆపై ఆదాయం ఉన్నవారికి రూ. 30 వేలు అందించడం జరుగుతోందని వివరించారు.

మన రాష్ట్రం నుంచి వెళ్లేవారికి మెడికల్ పరంగా, ప్రభుత్వ ఉద్యోగులను వాలంటీర్లను ఏర్పాటు చేసి, సేవలందించడానికి వీలు ఉంటుందని పేర్కొన్నారు. మక్కాకు వెళ్లేవారు, ముస్లిం సోదరులు, ఉచితంగా సేవలందించే 20 నుంచి 22 హజ్ సొసైటీలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పలువురు మైనారిటీ సంఘాల నాయకులు, హజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

వన్య ప్రాణిని కాపాడిన నారాయణపేట రైతులు

Satyam NEWS

విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల మీట్ కు విస్తృత ఏర్పాట్లు

Bhavani

Leave a Comment