పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, హరిత తెలంగాణ సాధనకు కృషి చేయాలనీ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరిత తెలంగాణ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఆరవ విడత హరితహారం లో రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటి అటవీ క్షేత్రాలను పెంపొందించుకోవాలన్నారు. పచ్చదనంతో పాటు వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందన్నారు.
సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. అనంతరం ఆసుపత్రి సమావేశ మందిరంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి ని అధ్యక్షులుగా జడ్పీటీసీ లు సభ్యులుగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.
రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే ఈ సమావేశంలో వైద్య సేవలతో పాటు ఆస్పత్రికి అవసరమైన సదుపాయాలపై చర్చిస్తామని అన్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో ప్రస్తుతి, ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు డాక్టర్లు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు అందాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగితే కెసిఆర్ కిట్ తో పాటు ఆడబిడ్డకు 13వేలు మగబిడ్డకు 12వేల నగదు అందిస్తామని చెప్పారు.
కరోనా సమయంలో రాత్రి పగలు సేవలందించిన డాక్టర్లకు సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, ఎం ఎల్ ఏ విఠల్ రెడ్డి, ఆసుపత్రి సూపరిండేంట్ దేవేందర్ రెడ్డి, డిఎం అండ్ ఎచ్ఓ డా. వసంత్ రావు, డిఎస్పీ ఉపేంద్ర రెడ్డి, డాక్టర్లు సురేష్, రజిని, నాయకులు రాంకిష్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, జడ్పిటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.