హైదరాబాద్ నగరంలో నేటి సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై కూడా ట్రాఫిక్ జాంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఒక్కసారిగా కురిసిన వర్షంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో రోడ్లపై నీళ్లు చెరువులను తలపించేలా నిలిచిపోయాయి. చాలా చోట్ల వాహనాలు నీళ్లలో చిక్కుకుపోయాయి.
ఎర్రగడ్డ నుంచి కూకట్ పల్లి వెళ్లే రోడ్లు లో అయితే కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు రోడ్డుపైనే రాత్రి వరకూ ఉండిపోయారు.
ట్రాఫిక్ పోలీసులు ఎక్కడా కనిపించకపోవడంతో మోకాళ్ల లోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కార్లు, ఆటోలు, లారీలు నీళ్లలో నిలిచిపోయాయి.
ద్విచక్రవాహనాలైతే నీటి ఉధృతిలో కొట్టుకుపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
ట్రాఫిక్ చెలానాలు వేసేందుకు వచ్చే పోలీసులు కష్టకాలంలో ఎక్కడా కనిపించడం లేదని వాహనదారులు అంటున్నారు. ట్రాఫిక్ ను రెగ్యులేట్ చేసి ఉంటే ఇన్ని తిప్పలు ఉండేవి కాదని వారన్నారు.