తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుల నియామకం జీవోను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేయడం హర్షణీయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
52 మంది ప్రత్యేక ఆహ్వానితుల కోసం సిఫార్సు లేఖలు ఇచ్చిన వారి పేర్లను ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికైనా బహిర్గతం చేయలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించడం తొందరపాటు చర్య అని అపార అనుభవం ఉన్న అధికారులు ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల జీవో ఇచ్చినప్పుడే టీటీడీ అధికారులు వాస్తవాలు చెబుతూ మంచి సలహా ఇచ్చి ఉపసంహరించుకునేలా చేసి ఉంటే ఈరోజు హైకోర్టు జీవోను సస్పెన్షన్ చేసే పరిస్థితులు ఉండేవి కాదని ఆయన అన్నారు.
చట్టం ఎలా ఉందో చెప్పకుండా ముఖ్యమంత్రి పరువు తీస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
పిటీషన్ దారులు హైకోర్టుకు వెళ్లేందుకు ఉన్నత స్థానంలో ఉన్న అధికారులే సహకరించారని ఆరోపణలు కూడా ఉన్నాయని ఈ అంశంపై కూడా ముఖ్యమంత్రి విచారణ చేసుకుంటే నిజాలు తెలుస్తాయని ఆయన అన్నారు. అధికార బలంతో, అంగబలంతో విర్రవీగుతూ ఈరోజు తప్పించుకోవచ్చు కానీ ఎప్పటికైనా వెంకన్న కోర్టులో శిక్ష తప్పదు అన్న దానికి హైకోర్టు తీర్పే నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు.