కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో పోలీసులు అలసిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.
కరోనా వైరస్ ను అరికట్టేందుకు అందరూ ఇళ్లలో ఉంటే చాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. రోజూవారీ కూలీలకు, పేద వారికి నిత్యావసర వస్తువులు దొరక్క ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజా పంపిణీ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం మరింత పకడ్బందిగా నిర్వహించాలని ఆయన కోరారు.
నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోతే ప్రజలు రోడ్లపైకి వస్తారని, అప్పుడు కరోనా అరికట్టడానికి మరింత శ్రమ పడాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా వంగపల్లి ఆలేరు జాతీయ రహదారిపై ఆయన పోలీసులకు మాస్కులను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వర్గ ఇన్ చార్జి బీర్ల అయిలయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.