ఇసుక అక్రమ రవాణా దారులతో పోలీసులు కుమ్మక్కయి ఎడ్లబండ్ల యజమానులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ఎడ్ల బండ్లు యజమానులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా దారులతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఎడ్ల బండ్ల యజమానులు ఆరోపించారు.
చీరాల పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఎడ్లబండ్లు యజమానులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం ఎడ్లబండిపై ఇసుక రవాణాకు అవకాశం కల్పించింది. అయితే కొంత మంది ఇసుక అక్రమార్కులు తమ సొంత మనుషులను పురమాయించి కొత్తగా ఎడ్లబండ్ల ను కొనుగోలు చేసి మరి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
ఇది అంతటితో ఆగలేదు కొంతమంది పోలీసు అధికారులు ఇసుక అక్రమార్కుల తో వర్కింగ్ పార్టనర్ లుగా అవతారం ఎత్తడం తో, ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ క్రమంలో కొంతమంది పోలీసు అధికారులు ఎడ్లబండ్ల యజమానులపై దురుసుగా వ్యవహరించడంతో పరిస్థితి విషమించింది. పోలీసుల దురుసు ప్రవర్తన చీరాల నియోజకవర్గం మొత్తంగా ఉన్న ఎడ్ల బండ్లు యజమానులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శన చేశారు.