రాష్ట్రవ్యాప్తంగా బార్ ల లైసెన్సులను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. తమ లైసెన్సులు రద్దు చేయడంపై బార్ యజమానులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం లైసెన్సుల రద్దుపై ఆరు నెలల స్టే విధిస్తూ తీర్పునిచ్చింది.
ఏపిలో నూతన లిక్కర్ పాలసీని తీసుకువచ్చిన ప్రభుత్వం మద్య నియంత్రణ దిశగా చర్యలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే మరో ఆరునెలల గడువు ఉన్నప్పటికి ముందగానే రాష్ట్రవ్యాప్తంగా వున్న బార్ల లైసెన్సులను రద్దు చేసింది. దీంతో బార్ల యజమానులకు తమకు ప్రభుత్వ నిర్ణయం వల్ల అన్యాయం జరుగుతోందంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బార్ల నిర్వహణకు ప్రభుత్వమే విధించిన లైసెన్స్ గడువు ఉన్నా ముందుగా ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది.
కొన్ని బార్ లైసెన్సులకు 2020 వరకూ గడువు ఉందని…అయినా అన్ని బార్ లైసెన్సులను ఆకస్మికంగా ప్రభుత్వం రద్దు చేసిందని బార్ల యాజమాన్యాల తరపు న్యాయవాది న్యాయమూర్తికి విన్నవించారు. వీరి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం లైసెన్సుల రద్దుపై ఆరు నెలల స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా నూతన బార్ల లైసెన్సులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
వచ్చే జనవరి ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్లపాటు బార్ల ఏర్పాటుకు కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాత బార్ లను ఆరునెలల పాటు కొనసాగించుకోవచ్చన్న హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి తలనొప్పి తీసుకువచ్చేలా కనిపిస్తోంది.