రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు పంటలు నష్టపోతుంటే సీఎం కేసీఆర్ ఎక్కడున్నారని బీజేపీ జాతీయ ఉపాద్యక్షరాలు డీకే అరుణ ప్రశ్నించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలనలో భాగంగా కామారెడ్డి జిల్లా సదశివనగర్ మండలంలో డీకే అరుణ పర్యటించారు. మండలంలోని కల్వరాల్, పద్మాజీవాడి, సదాశివనగర్ మండల కేంద్రాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంటలను ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇటీవల కురిదిన వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. లక్షల ఎకరాల్లో వర్షాలకు రైతుల పంటలు దెబ్బతిన్నాయని, ఇండ్లు కూలిపోయాయని తెలిపారు. నష్టపోయిన రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి 50 వేల నష్టపరిహారం అందించాలని, తక్షణ సహాయం కింద 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.నష్టపోయిన పంటల వివరాల పరిశీలన కోసం ఇప్పటికి కూడా సర్వే చేపట్టలేదన్నారు.
మాది రైతు ప్రభుత్వం అని కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు అల్లాడుతుంటే ఇంటి గడప కూడా కెసిఆర్ దాటకపోవడం శోచనీయమన్నారు. కనీసం ఏరియల్ సర్వే ద్వారా కూడా పంటలను పరిశీలించలేదన్నారు. ఆగస్ట్ 3 న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు పరిహారం అందించాలని బీజేపీ తీర్మానం ప్రవేశపెడుతుందని తెలిపారు.