అమరావతి నుంచి రాజధాని తరలించే ప్రక్రియపై మంకుపట్టుపట్టి ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. మూడు రాజధానుల ప్రకటన చేసి ఏడాది గడిచినా పూచిక పుల్ల కూడా కదిలించలేకపోయిన ఆయన ఇప్పుడు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు ముందుగా విశాఖ పట్నం కు తరలివెళ్లడం తాత్కాలికంగా పక్కన పెట్టి న్యాయ రాజధానిపై ఆయన దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అమరావతి నుంచి న్యాయ రాజధానిని తక్షణమే కర్నూలుకు తరలించేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇటీవల ఆయన ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు స్పష్టమైన హామీని బిజెపి పెద్దలు ఇచ్చినట్లు తెలిసింది. అమిత్ షా ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేస్తే తదుపరి చర్యలు ప్రారంభం అవుతాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెబుతున్నందున ఆ పార్టీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి మద్దతు పలకాల్సిన పరిస్థితిలోనే ఉంటుంది.
కర్నూలుకు హైకోర్టు తరలిస్తే బిజెపి ఏ మాత్రం మాట్లాడేందుకు వీలుండదు. అందువల్ల న్యాయ రాజధానిని తక్షణమే కర్నూలు కు తరలించేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారు.